మారనున్న భారత విశ్వవిద్యాలయాల భవిత
ప్రజాశక్తి-క్యాంపస్
నూతన విద్యావిధానం-2020 తో భారతదేశంలోని విశ్వవిద్యాలయ స్వరూప, స్వభావాలు పూర్తిగా మారబోతున్నాయని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ, కర్ణాటక , పూర్వ ఉపకులపతి ఆచార్య కె.బాలవీరారెడ్డి అన్నారు. ఎస్వీయూ సెనేట్ హాల్లో ఎస్వీయూ అధ్యాపకులకు యన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) ర్యాంకులో అత్యుత్తమ గ్రేడ్ సాధించడమెలా అనే అంశంపై గురువారం దిశానిర్దేశం చేశారు. నూతన విద్యావిధానం ద్వారా విద్యార్థులకు మల్టీ డిసిప్లీన్ విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. 2035 నాటికి దేశంలో మూడు రకాల విశ్వవిద్యాలయాలు ఏర్పాటవుతాయని, బోధన, పరిశోధన, సమ్మిళిత విశ్వవిద్యాలయాలుగా అన్నీ రూపాంతరం చెందబోతున్నాయన్నారు. ఎస్వీయూ రెక్టార్ ఆచార్య శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ ఎస్వీయూ బోధన సిబ్బందిలో భాగమైన అకడమిక్ కన్సల్టెంట్లు పరిశోధన రంగంలో ప్రతిభ చూపాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య మహమ్మద్ హుస్సేన్, ఎస్వీయూ న్యాక్ డైరెక్టర్ ఆచార్య యం.శ్రీనివాసులురెడ్డి, డీన్ ఆచార్య విజయభాస్కరరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.










