May 01,2023 20:04

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎర్రకోట

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
తమపై పోటీ చేసి గెలవగలరా అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి లోకేష్‌కు సవాలు విసిరారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తనను, తన కుటుంబాన్ని క్యాష్‌ కేశవరెడ్డి అన్నారని, నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటామని తెలిపారు. ఎమ్మిగనూరులో వృద్ధాప్యంలో కూడా టికెట్‌ తెచ్చుకొని పోటీ చేస్తామని, దమ్ముంటే లోకేష్‌ తనపై పోటీ చేసి గెలువాలనిని సవాలు విసిరారు. ఒకవేళ లోకేష్‌ గెలిస్తే తమ కుటుంబం మొత్తం రాజకీయాలకు దూరంగా ఉంటామన్నారు. అదే తాము గెలిస్తే లోకేష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. టిడిపిని నడిపే పరిస్థితి లోకేష్‌కు లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అభిమానులు, టిడిపి అభిమానులు, లోకేష్‌ను రోడ్డుపై కూర్చోబెట్టి జూనియర్‌ ఎన్‌టిఆర్‌కు టిడిపి పట్టం కడతారని జోష్యం చెప్పారు. లోకేష్‌ యువగళం యాత్ర కోసం మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనగేశ్వర్‌ రెడ్డి భూమాఫియా, అక్రమాలు చేస్తున్న వారి దగ్గర డబ్బులు తీసుకొని యాత్ర చేశారని విమర్శించారు. వైసిపి మండల కన్వీనర్‌ బిఆర్‌.బసిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ డి.నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.