ప్రజాశక్తి - కౌతాళం
పాలస్తీనా దేశంలో మానవత్వాన్ని కాపాడి ఆ దేశంపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆపాలని ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుభాన్, జై భీమ్ నాయకులు అవతారం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. జామియా మసీద్, మసీద్-ఎ-మదీనా, నురానీ మసీద్, మసీద్-ఎ-అక్సాలో ప్రార్థన ముగించుకొని గ్రామంలోని ఖాదర్ లింగ స్వామి దర్గా, పాతబస్టాండ్, ఎల్లప్ప సర్కిల్, కొత్తబస్టాండ్ మీదుగా వైఎస్ఆర్, అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించి, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ యుద్ధంలో చిన్నపిల్లలు, వృద్ధులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. భారతదేశం శాంతిని కోరుకుంటే, పాలకులు ఇజ్రాయిల్కు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. పాలస్తీనాపై ఉగ్రవాదుల నిందలు వేసి ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోందని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని పాలస్తీనాకు మద్దతుగా ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు. అనేక దేశాల్లో శాంతి ర్యాలీలు నిర్వహించి పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. జై భీమ్ నాయకులు, కౌతాళం సర్పంచి పాల్ దినకరన్, మాజీ సర్పంచి అవతారం మద్దతు తెలికారు. ఖాజా హుస్సేన్, యాసర్ బాష, హఫీజ్ హుస్సేన్, ఖురేషి మహబూబ్, మాసుం బాష, ఖాదర్ బాష, సయ్యద్ దూద్ బాష, లడ్డు ఖాదర్ పాల్గొన్నారు.
నిరసన చేపడుతున్న నాయకులు