Sep 12,2023 21:13

పూసపాటిరేగ: వాలీబాల్‌ పోటీలో తలబడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి -పూసపాటిరేగ : మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని ఎంఇఒ ఎ. రాజ్‌కుమార్‌, బి. పాపినాయుడు అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌విఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మండలస్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను ఎంఇఒలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు ముఖ్యమేనని తెలిపారు. విద్యార్థులందరూ గెలుపు ఓటమిలతో సంభందం లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో ఆడాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలిగాలని చెప్పారు. క్రీడలలో రాణించి ఉన్నతస్థాయిలో ఉన్న క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మొదటి రోజు ఖోఖో, వాలీబాల్‌, టెన్నకాయిట్‌, త్రోబాల్‌ అంశాలలో జరిగిన క్రీడా పోటీలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలకు స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌గా పి. లీలాకృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు బి. శంకరరావు, వ్యాయామ ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బాడంగి: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంఇఒ రాజేశ్వరి మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలను మంగళవారం ప్రారంభించారు. స్థానిక హెచ్‌ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ వారు మండల స్థాయి టోర్నమెంట్‌, సెలక్షన్స్‌ నిర్వహించారు. ప్రధానంగా వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, త్రోబాల్‌, టెన్నికాయిట్‌, యోగ, అథ్లెటిక్స్‌లో పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారు బొబ్బిలి నియోజకవర్గం స్థాయి ఆటల పోటీల్లో ప్రాతినిత్యం వహిస్తారని పీడీ బంగారునాయుడు తెలిపారు. ఈ పొటీలలో కెజిబివి, సోషల్‌ వెల్ఫేర్‌, రెసిడెన్షియల్‌, వాడాడ, రేజేరు కోడూరు, బాడంగి పాఠశాలల విద్యార్థులు, పీడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెర్లాం: మండలంలోని పెరుమాలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి అండర్‌ 14, అండర్‌ 17 ఆటలు పోటీలు నిర్వహించారు. తొమ్మిది పాఠశాలల నుండి బాల బాలికలు వివిధ రకాల ఆటల పోటీల్లో పాల్గొని తలబడ్డారు. ఇందులో విజేతలు భవిష్యత్తులో జరగనున్న నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎఎంసి చైర్మన్‌ బి. శ్రీనివాసరావు 200 మంది విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ త్రినాధ రావు, నాయకులు అప్పల నరసింహరాజు, అప్పలరాజు, అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ కన్వీనర్‌ పి గురుమూర్తి, 9 పాఠశాలల పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెరకముడిదాం: విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యవంతంగా ఉండటానికి క్రీడలు ధోహద పడతాయని వైసిపి నాయకులు తాడ్డి వేణుగోపాలరావు అన్నారు. మంగళవారం మండలస్థాయి అండర్‌ 14, అండర్‌ 17 క్రీడా పోటీలను గర్భాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎస్‌ వి రమణరాజు, కోట్ల వెంకటరావు, పప్పల క్రిష్ణమూర్తి, తాడ్డి చంద్ర శేఖర్‌, ఎంఇఒ ఎం. ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్‌ఎస్‌ఆర్‌ ఆచార్యులు, గర్భాం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ గాబ్రియేల్‌ తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: మండలస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన స్పోర్ట్స్‌ మీట్లో కంటకాపల్లి హైస్కూల్‌కు వాలీబాల్‌, టెన్నిస్కో ప్రథమ స్థానం వచ్చిందని స్కూల్‌ పిఇటి అమరావతి తెలిపారు. మంగళవారం దెందేరు హైస్కూల్లో స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన అండర్‌ 17 విభాగంలో దెందేరు హైస్కూల్‌, వియ్యంపేట హైస్కూల్‌, ఓపి జిందాల్‌, కొత్తవలస హైస్కూల్‌, కంటకాపల్లి హైస్కూల్‌ నుంచి టీములు పాల్గొన్నాయన్నారు. వీటిలో వాలీబాల్‌, టెన్నిస్కోలలో కంటకాపల్లి టీం విజయం సాధించిందని తెలిపారు. విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం ఉపాధ్యాయులు అభినందించారు.