
రణస్థలం: శ్యాంపిస్టన్స్లో బలవంతపు ఉద్యోగ విరమణను నిలుపుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, శ్యాంక్రగ్ పిస్టన్స్ (రింగ్స్) వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గొర్లె కిరణ్ డిమాండ్ చేశారు. మండలంలోని శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ ప్లాంట్-2 పరిశ్రమలో యాజమాన్యం 30 ఏళ్లు సర్వీసు కాకుండానే పూర్తయిందనే నెపంతో కార్మికులను బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించారని అన్నారు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులతో మానసిక క్షోభకు గురై, వేరే ఉపాధి కోసం చేసే ప్రయత్నంలో కార్మికుడు వై.వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని అన్నారు. మెదడుకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. విషయం తెలుసుకున్న వారు విశాఖ వెళ్లి వెంకటేశ్వరరావును సోమవారం పరామర్శించారు. పరిశ్రమలో కార్మికులెవరికీ తెలియని స్టాండింగ్ ఆర్డర్ని సాకుగా చూపించి యాజమాన్యం ఈ విధమైన బలవంతపు ఉద్యోగ విరమనకు పాల్పడుతుందని అన్నారు.