మానసిక ప్రశాంతతోనే పరిపూర్ణ ఆరోగ్యం
సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతారని, మానసిక ఆరోగ్యంపై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని జిల్లాన్యాయ సేవాధికార సెక్రటరీ సీనియర్ సివిల్జడ్జి డాక్టర్ ఐ.కరుణ కుమార్ తెలిపారు. మంగళవారం 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకుని వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ.ప్రభావతిదేవి ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ సమక్షంలో అపోలో నర్సింగ్ స్టూడెంట్స్ ద్వారా ర్యాలీని సీనియర్ సివిల్ జడ్జి ప్రారంభించారు. ఈసందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. యాంత్రిక జీవనంలో పెరుగుతున్న మానసిక సమస్యలు, ఫోన్లు, టీవీలతో ఎక్కువగా కాలక్షేపం చేయడం, మరోవైపు ఆశ, అత్యాశ పెరిగిపోయి జీవితంలో సంతప్తి అనేది లేకుండా పోయిందన్నారు. దీని వలన టెన్షన్, డిప్రెషన్ అధికమయ్యాయని, మరోవైపు రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయని, ఆరోగ్యకర జీవన శైలి లేక వివిధ రకాల మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతారని, మానసిక ఆరోగ్యం పై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్, డాక్టర్ సందీప్, శ్రీవాణి హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.










