ఎస్పి అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్పి ఎం.దీపిక
ప్రజాశక్తి-విజయనగరం : ప్రతీ ఒక్కరూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలని జిల్లా ఎస్పి దీపికా పాటిల్ సూచించారు. అక్టోబరు 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా, స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి జెఎన్టియు జంక్షన్ వరకు అవగాహనా నడకను శనివారం నిర్వహించారు. అక్కడ మానవహారాన్ని ప్రదర్శించి, మానసిక ఆరోగ్య ఆవశ్యకతపై నినాదాలు చేశారు. ఎస్పి దీపిక మాట్లాడుతూ, మానసికంగా ప్రతీ ఒక్కరూ ధృడంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, మానసిక విభాగాధిపతి డాక్టర్ బిజెపి మల్లిక, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.










