ప్రజాశక్తి-చీరాల: పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని షాడో సంస్థ ప్రతినిధి రాజా సాల్మన్ అన్నారు. శుక్రవారం షాడోస్ మరియు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సత్యార్థి ఫౌండేషన్ కెఎస్సిఎఫ్ సంయుక్తంగా ఆధ్వర్యంలో చీరాల రైల్వేస్టేషన్లో ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో బాలలపై మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మాట్లాడారు. ఈ సందర్భంగా షాడోస్ సంస్థ ప్రతినిధి రాజా సాల్మన్ మాట్లాడుతూ వీధి బాలబాలికలు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. పిల్లల తల్లిదండ్రులు మాదక ద్రవ్యాల దుర్వినియోగం ప్రమాదాన్ని గుర్తించాలని ఆల్కహాల్ దుర్వినియోగంతో పాటు పారిశ్రామిక జిగురు, వైట్నర్ వాడకం పిల్లలలో పెద్ద సమస్యగా ఉందని అన్నారు. ఈ మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రించి హాట్ స్పాట్ లను గుర్తించాలని, పిల్లలే దేశ భవిష్యత్తు కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి పిల్లలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ఆర్పీఎఫ్ సీఐ ఎ శ్రీనివాసరావు మాట్లాడుతూ సురక్షిత బాల్యం, సురక్షిత భారత్ కావాలని అన్నారు. ఈ సమావేశంలో బి భాగ్యలక్ష్మి, పి తులసి, రైల్వే పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










