ప్రజాశక్తి-అరకులోయ రూరల్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీవేరి దొన్నుదొర ఆధ్వర్యాన యండపల్లివలస రైల్వే స్టేషన్ నుండి ఎన్టీఆర్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఎస్టీ సెల్ అద్యక్షుడు సీవేరి దొన్ను దొర మాట్లాడుతూ, 2024లో అరకు నియోజకవర్గంలో టీడీపి గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మిని మేనిఫెస్టో చూసి జగన్ మోహన్ రెడ్డి కి భయం పట్టుకుందన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.
అరకు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, జీవో 3పై రాష్ట్ర ప్రభుత్వం కనీసం రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, అరకు వేలి మండల అద్యక్షుడు శెట్టి బాబురావు, బూర్జ లక్ష్మి, అరకు పార్లమెంట్ కోశాధికారి వంతాల నాగేశ్వరరావు, పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు పాల్గొన్నారు.










