న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితుడు, ముంగేర్ ఎంపి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల మోడీ కేబినెట్లో చేరిన రామ్చందర్ ప్రసాద్ (ఆర్సిపి) సింగ్ స్థానంలో లలన్ సింగ్ నియమితులయ్యారు. పార్టీ కార్యాలయంలో జరిగిన జెడి (యు) జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 1980వ దశకం నుండి లలన్ సింగ్, నితీష్కు సన్నిహితంగా ఉంటున్నారు. ఇండిపెండెంట్ సభ్యుడు సుమిత్ కుమార్ సింగ్తో పాటు ఎల్జెపికి వున్న ఏకైక ఎంఎల్ఎ రాజ్ కుమార్ సింగ్ను జెడియులోకి తీసుకొచ్చి, ఆ ఎల్జెపికి సభ్యులెవరూ లేకుండా చేయడం వెనుక గల ప్రధాన సూత్రధారుల్లో లలన్ ఒకరు. కేబినెట్ పదవి కోసం పోటీ పడిన లలన్ సింగ్కు జాతీయ అధ్యక్షుడి పదవి దక్కడం గమనార్హం.