
ప్రజాశక్తి- తగరపువలస : ఎంచుకున్న లక్ష్యం ఉన్నతంగా ఉండాలని ఎయు కాలేజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ వై.రాజేంద్రప్రసాద్ విద్యార్థులకు సూచించారు. స్థానిక అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విద్యార్థుల ఇండక్షన్ మీట్, ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర ప్రసాద్ హాజరై మాట్లాడారు. ఫ్రెషర్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. ఫార్మసీ రంగంలో మెరుగైన వేతనాలతో కూడిన ఉన్నతమైన ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఎఐపిఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంబివి.రాజు మాట్లాడుతూ, ఫార్మసీ విభాగంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వనరులు తదితర అంశాలను వివరించారు. అరబిందో ఫార్మా లిమిటెడ్ ఒంగోలు క్లస్టర్ హెడ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ శేషసాయి, ఎఐపిఎస్ పూర్వ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ వి.ఉమా శంకర్, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.