
ప్రజాశక్తి - భీమవరం
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసి, మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ నుంచి రీసర్వే, స్టోన్ ప్లాంటేషన్, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, భూ సేకరణ, ఓటర్ల జాబితా సవరణ, సిసిఆర్సి కార్డులు, సివిల్ సప్లై తదితర అంశాలపై జిల్లా జాయింటు కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డితో కలిసి జిల్లాలోని అన్ని మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా ప్రగతిని జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకుని మాట్లాడారు. జిల్లాలో తొలగించిన ప్రతి ఓటునూ పున:పరిశీలన చేయాలని స్పష్టం చేశారు. బిఎల్ఒలు తనిఖీ చేసిన ఫైల్స్ను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రత్యేక అధికారులు తనిఖీలు చేయాలన్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి ఎస్.రామ్ సుందర్రెడ్డి, డిఆర్ఒ కె.కృష్ణవేణి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.