
- సిపిఎం నాయకులు సీతారామయ్య, నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కూనవరం
మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను పునరుద్ధరించాలని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండలంలోని ముల్లూరు, రేపాక గ్రామాల్లోని చెరువులు, చెక్ డ్యామ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను సిపిఎం నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలో శబరి, గోదావరి నదులున్నా రైతుల భూములకు సాగునీరు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. ఒక వైపు భారీ వర్షాలు వచ్చి వరదలకు భూములు ముగినిపోవడం, మరోవైపు వర్షాలు పడకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న సాగు నీటి వనరులను ఉపయోగించడానికి ప్రభుత్వ సహకారం లేకుండా పోయిందని, చెరువులకు సరైన గేట్లు లేక నీరు వృధాగా గోదాట్లో కలిసిపోతుందని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఐటిడిఎ ద్వారా నిర్మించిన చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పాడైపోయినా వాటిని ప్రభుత్వం ఐటిడిఎ అధికారులు పట్టించుకోవడం లేదని, వాటికి మరమ్మతులు చేయడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ఐటిడిఎ అధికారులు స్పందించి చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, విద్యుత్ లైన్లు ఉన్న భూములలో వ్యక్తిగత బోర్లు, మోటార్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, ఎంపీటీసీ అమ్మాజీ, సర్పంచ్ బొగ్గా వెంకమ్మ, నాగమణి, రైతులు పిచ్చయ్య, మడకం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.