Mar 17,2023 22:40

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌
వినియోగదారులకు తక్కువ ధరలకే హస్త కళా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు లేపాక్షి గాంధీ శిల్ప బజార్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. ఎపి హస్త కళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సిద్దార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి లేపాక్షి గాంధీ శిల్ప బజార్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రలకు చెందిన హస్త కళాకారులు వారి కళా నైపుణ్యంతో రూపొందించిన హస్త కళ ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి సుమారు వందకు పైగా స్టాల్స్‌ ద్వారా ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ హ్యాండీ క్రాప్స్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌.అపర్ణలక్ష్మి మట్లాడుతూ దేశంలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఒరిస్సా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, గుజిరాత్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పేరుగాంచిన హస్త కళా ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించనునట్లు ఆయన తెలిపారు. లేపాక్షి ఒఎస్‌డి లక్ష్మినాధ్‌ మట్లాడుతూ లేపాక్షి చైర్‌ పరస్సన్‌ బి.విజయలక్ష్మి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యం.విశ్వల పర్యవేక్షణలో ఈ నెల 26వ తేది వరకు ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు సెలవు రోజులలో కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి మేనేజర్‌ యం సురేష్‌, డిసిహెచ్‌ హెచ్‌పివో సువర్చల, ఎగ్జిబిషన్‌ ఇన్‌ఛార్జి మేనేజర్‌ బి.శైలజ, మార్కెటింగ్‌ మేనేజర్‌ శ్రీథరా చార్యులు, లేపాక్షి అధికారులు టి.రాజశేఖర్‌, చంద్రశేకర్‌, బివి రాజు తదితరులు పాల్గొన్నారు.