- బ్యాంకర్ల సమావేశంలో మేయర్, కమిషనర్
ప్రజాశక్తి-విజయవాడ
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అర్హత ఆధారంగా రుణ సదుపాయం కల్పించడంలో బ్యాంకర్స్ సహకరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. విఎంసిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో బ్యాంకర్స్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలకు రుణ సదుపాయం కల్పించుటలో బ్యాంకర్స్ ముందుకు రావాలని కోరారు. వై.ఎస్.ఆర్.టిడ్కో (హౌసింగ్) లోన్స్ రివ్యూ, జగనన్న తోడు, ఫి.యం.స్వానిధి లబ్దిదారులకు, పలు సంక్షేమ పధకములు, పేద ప్రజలకు అందజేసే అంశంలో అర్జీ దారుల అర్హత ఆధారంగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ది పనులకు కావాల్సిన రుణాలను సదరు లబ్దిదారులకు సక్రమంగా మంజూరుయ్యేందుకు బ్యాంకర్స్ సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ సమావేశంలో యుసిడిపిఒ కే.శకుంతల, డిసిఒ ఆనంద్రావు, టిఇ ఫణి టిఇ మమత తదితరులు పాల్గొన్నారు.










