Aug 04,2021 22:00

* న్యాయపరమైన పరిష్కారమే మేలు: ఏపి ప్రభుత్వం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం మరో ధర్మాసనానికి బదిలీ చేసింది.కృష్ణా జలాల వివాదం న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటూ, ఆంధ్రపదేశ్‌కి తాగునీటిని, సాగు నీటిని నిరాకరిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాది ఉమాపతి తన వాదనలు వినిపిస్తూ దీనికి న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. మీరు మధ్యవర్తిత్వం వద్దనుకుంటే మేమేమీ బలవంతం చేయం. ఈ కేసు మరో బెంచికి నివేదిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ ఇదివరకే చెప్పారు. ఆ ప్రకారమే ఈ చర్య తీసుకున్నారు. తొలుత కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ, సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని విచారిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా న్యాయపరమైన అంశాల్లో విచారణ చేయబోనని, దీనిని వేరే బెంచికి బదిలీ చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాధన్‌ కోర్టుకు హాజరయ్యారు.