
కలబర్గీ (కర్నాటక) : వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు. కర్నాటకలోని కలబర్గీలో ఖర్గే బుధవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఛత్తీస్ఘర్, రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ పని తాము సజావుగానే చేసుకుంటున్నాయని, ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉన్నదని, అన్ని రాష్ట్రాల్లోనూ విజయం తమకే లభిస్తుందన్న విశ్వాసంతో ఉన్నామని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల కారణంగా బీజేపీ ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటోందని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని ఖర్గే ఆరోపించారు. 'బీజేపీ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ ఒక్క దానిని కూడా నెరవేర్చలేదు. అది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కానివ్వండి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కానివ్వండి. పెట్టుబడులు కానివ్వండి' అని అన్నారు. కర్నాటకను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రాజెక్టులేవీ రాలేదని ఖర్గే గుర్తు చేశారు.