Aug 09,2023 00:28

ర్యాలీలో పాల్గొన్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

ములగాడ : క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారం 'క్విట్‌ మోడీ- సేవ్‌ ఇండియా' నినాదంతో కార్మిక సంఘాల ఆధ్వర్యాన జరిగే నిరసన దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ హెచ్‌పిసిఎల్‌ కల్యాణ్‌ గేటు వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మల్కాపురం జోన్‌ అధ్యక్షులు కె.పెంటారావు మాట్లాడుతూ, 9 సంవత్సరాల మోడీ పాలనలో కార్మిక సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలుకు పెంచాలన్న డిమాండ్‌ను పెడచెవి పెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐయన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవిల్లి నాగభూషణం, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు, సిఐటియు జిల్లా నాయకులు పూడి పైడిరాజు, ఎఐటియుసి జిల్లా నాయుకులు కె.సత్యనారాయణ, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయుకులు ఎం.కృష్ణారావు, జి.నరేష్‌, రాజేష్‌, తాతబాబు, నర్శింగ్‌, భూలోక, కృష్ణ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
సీతమ్మధార : 'క్విట్‌ మోడీ- సేవ్‌ ఇండియా' పేరుతో జరుగుతున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం అక్కయ్యపాలెం జోన్‌ నాయకులు రాజు కోరారు. ఆగస్టు 9 క్విట్‌ ఇండియా స్ఫూర్తితో మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడుకునేందుకు మహా ధర్నాకు కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టే దీక్షను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలరాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పిఎం పాలెం : 'క్విట్‌ మోడీ- సేవ్‌ ఇండియా' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ జివిఎంసి జోన్‌-2 కార్యాలయం నుంచి మధురవాడ వంతెన మీదుగా మార్కెట్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి నుంచి కార్మిక, ప్రజల హక్కులను పోరాటాల ద్వారా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా డే సందర్భంగా 'క్విట్‌ మోడీ- సేవ్‌ ఇండియా' పేరిట జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహించే కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవి.ప్రసాద్‌, డి.అప్పలరాజు, ఎస్‌.రానప్పడు, సిహెచ్‌.శేషుబాబు, కె.నాగరాజు, కె.రాజు, నక్క అప్పారావు, ఎం.లలిత, కేర్జునమ్మ, నరేంద్ర, బి.అప్పారావు, యు.ఉమ, పి.నర్సిగ్‌రెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.