Jan 11,2023 00:18

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం చందక పంచాయతీ జగన్నాధపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌- 1లో ఏనుగుకొండ క్వారీ గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దంటూ జగన్నాధపురం గ్రామస్తులు స్పష్టంచేశారు. క్వారీ తవ్వకాల అనుమతిపై జగన్నాధపురం గ్రామంలో డిఆర్‌ఒ శ్రీనివాస్‌మూర్తి, పొల్యూషన్‌ కంట్రోల్‌ అధికారి వెంకటేశ్వర్లు, మైనింగ్‌ అధికారి శాంతారావు ఆధ్వర్యాన మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. డిఆర్‌ఒ శ్రీనివాసరావు మూర్తి మాట్లాడుతూ, జగన్నాధపురంలో సుమారు 19.953 హెక్టార్లో గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు ఉన్న సమస్యలపై తహశీల్దార్‌ లోకవరపు రామారావును అడిగి తెలుసుకున్నారు.
జగన్నాధపురం గ్రామస్తులు మతికాన జట్లయ్య, పాండ్రంకి రామారావు, బాకురుపాలెం సర్పంచ్‌ ధవళ నాగేశ్వరరావు, రైతులు గొర్లె అప్పలనాయుడు ఆల్తి రమేష్‌ అధికారులతో మాట్లాడుతూ, సర్వే నంబర్‌ 1లో సుమారు 40 మంది రైతులు జీడి మామిడి తోటలు వేసుకొని జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. కొండ గ్రావెల్‌ తరలించడానికి అనుమతులు ఇస్తే పక్కన ఉన్న పంట భూములు, గ్రామాలు కాలుష్యానికి గురవుతాయన్నారు. ఈ భూములపై ఆధారపడి అనేక కుటుంబాలు పశుపోషణ చేసుకొని జీవనం సాగిస్తున్నాయని వివరించారు. క్వారీ అనుమతులు వల్ల పంట భూములు బీడు భూములుగా మారే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వరాదని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాభిప్రాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డిఆర్‌ఒ తెలిపారు.