Jun 20,2023 01:37
కుష్టు వ్యాధి సర్వే పోస్టర్‌ విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి-బాపట్ల: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఈ నెల 26 నుంచి జూలై 16వరకు ఆశా కార్యకర్తలు వాలంటీర్లు టీములుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగి అందరినీ పరీక్షించి కుష్టు అనుమానిత లక్షణాలు ఉన్న వారిని వ్యాధి నిర్ధారణ కోసం పీహెచ్‌సీకి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్‌ విజయమ్మ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కోఆర్డినేట్‌ కమిటీ సమావేశంలో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రత్యేక పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైద్యులు వ్యాధి నిర్ధారణ చేసి అవసరం ఉన్న వారికి మందులు ఉచితంగా ఇస్తారు. కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే కార్యక్రమానికి అందరూ సహకరించాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్‌, టిబి అధికారి సీవీ రమాదేవి, డిపిఎంఓ రోహిణి రత్నశ్రీ, సాదిక్‌, జిల్లా మలేరియా అధికారి రాజకుమార్‌, డీపీఓ రాంబాబు, డీపీఆర్‌ఓ, సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రాజ్‌ దెబోరా, డిపిఎంఓలు సుబ్బరాజు, సుబ్రహ్మణ్యం, హసన్‌ పాల్గొన్నారు.