అర్ధనగ ప్రదర్శన చేస్తున్న హమాలీలు
ప్రజాశక్తి-అనకాపల్లి
బేవరేజెస్ డిపో హమాలీల కూలి రేట్లు పెంచాలని కోరుతూ బుధవారం శంకరం వద్ద గల ఏపీబీసీఎల్ఐఎంఎఫ్ఎల్ అండ్మ ఎఫ్ఎల్ డిపో వద్ద హమాలీలు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష కార్యదర్శులు కనక రమణ, కొండలరావు మాట్లాడుతూ ఎగుమతి కూలీరేటు ఏడు రూపాయల నుంచి పది రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్ నుంచి చెల్లించాల్సిన ఏరియర్స్ను డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించని పక్షంలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. హమాలీ కూలి రేట్లు పెంచాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లవిల్లి నరసింగరావు, ఎల్లా అప్పారావు, జె.సూర్య నాయుడు, జి త్రినాథ్, తాడి రాజు, పి రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.










