ఎంఎల్సి కుడుపూడి సూర్య నారాయణ
ప్రజాశక్తి - అమలాపురం
కుల గణన జరగడం వల్ల బిసిల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని ఎంఎల్సి కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక గ్రాండ్ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసి కుల గణనకు ముందుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్కు రానున్న ఎన్నికల్లో బిసిలు వెన్నుముఖగా నిలుస్తారన్నారు. కులగణన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో దోబూచులాడుతుందన్నారు. మండల కమిషన్ సమయంలో బిసి హక్కులు కోసం పోరాటం చేశామన్నారు. 15 శాతం వున్న అగ్రకులాలు దేశాన్ని శాసిస్తున్నాయని తెలిపారు. బిసిల్లో విద్యా, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్నారు. రాజకీయ రిజర్వేషన్ కోసం కాదు, తమ పిల్లలు బాగుండాలనే కుల గణన కోరుతున్నామని బొంతు భూషణ్ అన్నారు. బిసిల్లో ఉపాధి కూలీలు అధికంగా ఉన్నారన్నారు. కులగణన చేయడం వల్ల తమ కులాల్లో ఎంతోమంది ముందు వరసలో నిలబడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కుడిపూడి త్రినాథ్, గుత్తుల భానుప్రకాష్, దండుమేను రూపేష్కుమార్, ఎం.ప్రసాద్కరుణాకర్, కె.దుర్గ, సత్తిబాబు, కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










