
ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి జోన్-2 పరిధి మధురవాడ సమీపం, ధర్మపురి కాలనీ వద్ద మంద వేసిన గొర్రెలపై బుధవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 35 గొర్రెలు మృతిచెందాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోలాకి గ్రామానికి చెందిన రమణ గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు ప్రతిఏటా దసరాకు మధురవాడ వచ్చి అప్పటి వరకు ఉన్న గొర్రెలను విక్రయించి తిరిగి స్వగ్రామానికి వెళుతుంటాడు. గత అక్టోబరులో సుమారు 200 గొర్రెలతో వచ్చి దర్శపురి కాలనీ సమీపంలో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకొని ఉం టున్నాడు. బుధవారం రాత్రి గొర్రెల మందపై ఒకేసారి ఆరు కుక్కలు దాడి చేసి 35 గొర్రెలను కొరికి చంపాయి. సంఘటన జరిగిన ప్రదేశాన్ని వెటర్నరీ డాక్టర్లు అరుణ్, జివిఎంసి ఎఎమ్హెచ్ఎ డాక్టర్ కిశోర్ తదితరులు సందర్శించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు గొర్రెల యజమాని రమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు రూ.3 లక్షలు విలువైన గొర్రెలు చనిపోయినట్లు రమణ తెలిపాడు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎఎమ్హెచ్ఎ కిశోర్ తెలిపారు.