
ప్రజాశక్తి-సీతమ్మధార : కథా నిలయం 26వ వార్షికోత్సవ సభ ఆదివారం పౌర గ్రంథాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బాల సాహిత్యం మీద ప్రముఖ రచయిత బమ్మిడి జగదీశ్వరరావు ప్రసంగించారు. ఒక పిల్లవాని భావి జీవితాన్ని ప్రభావితం చూపే బాల్యంలో చదువు పేరుతో బాలల కల్పనా శక్తులను నాశనం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాలలకు పౌష్టికాహారం ఎంత అవసరమో సాహిత్యం కూడా కనీస అవసరంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భావించాలని అభిప్రాయపడ్డారు. పిల్లల ఊహా ప్రపంచాన్ని చిదిమేసే పని చదువు పేరుతో జరగడం బాధాకరమన్నారు.
'కథా సాహితి' సంపాదకుడు వాసిరెడ్డి నవీన్ మాట్లాడుతూ, ఉత్తమ కథలను క్రమం తప్పకుండా 32 ఏళ్లుగా ఏటా ప్రచురిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ బాలల సినిమాలను పరిచయం చేస్తూ కథా రచయిత శివలక్ష్మి రచించిన 'చిగురంత ఆశ'నూ, ఉత్తమ అంతర్జాతీయ సినిమాలపై సమీక్షా సంపుటి 'రియలిస్టిక్ సినిమా'నూ రచయిత జయసూర్య ఆవిష్కరించారు. శ్రీకాకుళంలో ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు సారథ్యంలో స్థాపించిన కథా నిలయంలో నేటికీ 97 వేల కథలు లభ్యం అవుతున్నాయని కథా నిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు చెప్పారు. కథానిలయం వార్షికోత్సవ సభలు ఇకపై తెలుగు రాష్ట్రాలలోని వేర్వేరు నగరాలు, పట్టణాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కథా నిలయం కోశాధికారి కాళీపట్నం సుబ్బారావు వందన సమర్పణ చేశారు.