
కరువు మండలాల ప్రకటన కంటి తుడుపు చర్య
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెరెడ్డి తులసి రెడ్డి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
రాష్ట్రంలో కరువు మండలాల ప్రకటన కంటి తుడుపు చర్య అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెరెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిహెచ్ పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 685 మండలాలకు గాను 449 మండలాలలో తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు. ఖరీఫ్లో 40 శాతం సాగు భూమిలో పంటలు వేయలేదని, పంటలు వేసినా మిగతా 60 శాతం భూమిలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు లేక ప్రజలు వలస బాట పట్టారని చెప్పారు. కొన్ని చోట్ల అప్పుడే పశుగ్రాసం కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా రాష్ట్రంలో కేవలం 7 జిల్లాలలో 103 మండలాలనే కరువుగా ప్రకటించిదన్నారు ప్రకటించిన మండలాలలో కూడా ఇంతవరకు కరువు సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. కరువు మండలాలలో పర్యటించి పున పరిశీలన జరిపి 18 జిల్లాలలో 449 మండలాలను కరువుగా ప్రకటించాలని, యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పెద్ద ఎత్తున ఉపాధి పనులు ప్రారంభించి వలసలు నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు పుల్లయ్య, నంద్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ సికిందర్ భట్, ఉత్తనబి, సుబ్బరాయుడు, వినరు, పుల్లయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.