ప్రజాశక్తి - దేవనకొండ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం లాంటివని, పెద్దలకు కొమ్ము కాసి, పేదలకు అన్యాయం చేస్తూ, మతం ముసుగులో రాజకీయాలు చేసిన బిజెపికి కర్ణాటక ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం దేవనకొండలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కెవి.నారాయణ, జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడారు. వ్యవసాయ కార్మికులు వలసలు వెళ్లకుండా గ్రామాల్లోనే పనులు కల్పిస్తూ ఎంతో ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా వ్యతిరేకి బిజెపికి కర్ణాటక ప్రజలకు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం ఇప్పటికే దేశంలో ప్రజలకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 32 కోట్ల పని దినాలను కల్పిస్తామని చెప్పి 15 కోట్లకు తగ్గించడం దారుణమన్నారు. గతంలో ఉపాధి పనుల వద్ద కూలీలకు మౌలిక వసతులు కల్పించేవారని, ప్రస్తుత పాలక ప్రభుత్వాలు వాటిని విస్మరించాయని విమర్శించారు. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రైతుల ఎరువుల సబ్సిడీలో కోత విధించిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ రూ.46 లక్షల కోట్లు ప్రవేశపెడితే అందులో పేదలకు కేవలం 10 శాతం, సంపన్న వర్గాలకు 45 శాతం కేటాయించడం దారుణమన్నారు. కూలీలకు కొలతల ప్రకారం వేతనాలు ఇవ్వాలని, రెండు పూటలా హాజరు శాతం ప్రకారం చెల్లిస్తామనడం సబబు కాదని తెలిపారు. ఆన్లైన్ మస్టర్ వల్ల సాంకేతిక లోపాలతో కూలీలు పలు అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బటన్ నొక్కి నిధులు చెల్లిస్తూ కూలీలకు వచ్చిన ఉపాధి నిధులను కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ యంత్రాలతో పనులు చేస్తూ ఉపాధి చట్టానికి తూర్పు పొడుస్తోందని విమర్శించారు. పశ్చిమ రాయలసీమ ప్రాంత రైతుల సాగునీటి ప్రాజెక్టు హంద్రీనీవాకు బడ్జెట్లో నిధులు కేటాయించ లేదన్నారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఓటమి చెందడం శుభ పరిణామమని తెలిపారు. ఉపాధి హామీ చట్టం పట్ల బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు