
ప్రజాశక్తి -కంచరపాలెం: క్రికెట్లో ప్రపంచ ఖ్యాతినార్జించిన షబ్నమ్ను డివైఎఫ్ఐ, చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యాన కంచరపాలెంలోని బిఎన్ఆర్ భవన్లో శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ మాట్లాడుతూ, షబ్నమ్ వంటి క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత షబ్నమ్ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆటలు, పాటలు, విద్య తదితర రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రభుత్వం ఆట స్థలాలు, క్రీడా మైదానాలు ఏర్పాటుచేయడం ద్వారా పిల్లలు క్రీడల్లో మరింతగా రాణించే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గర్ల్ ఎంపవర్మెంట్ చైర్మన్ మోదంబిక, బిఎన్ఆర్ ఫౌండేషన్ కన్వీనర్ బుజ్జి, ప్రతినిధి అప్పలరాజు, కృష్ణారావు, శ్రీనివాసరాజు, సంతోష్, ఐద్వా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ డాక్టర్ ప్రియాంక, మహమ్మద్ సకిల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.