ప్రజాశక్తి-పాడేరు: అంధుల అంతర్జాతీయ క్రికెటర్ రవణిని అన్ని విధాల ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. ఆమె కుటుంబానికి ఆర్దిక సహాయం అందిస్తామన్నారు. హుకుంపేట మండలం మెరక చింత పంచాయతీ రంగసింగపాడు గ్రామానికి చెందిన రవణి అంధుల అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిసి తన క్రీడా ప్రయాణాన్ని జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియ జేసారు. రవణి క్రికెట్లో రాణించడం మన్యానికి గర్వకారణమన్నారు. డిగ్రీ వరకు చదువు కోవాలని సూచించారు. తాను కూడా క్రికెట్ ఆడతాను క్రికెట్పై ఆసక్తి ఎలా కలిగిందని అడిగారు. పాఠశాలలో టీచర్, ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో ముందుగా అధ్లెటిక్స్, ఆతరువాత క్రికెట్పై ఆసక్తి కలిగిందని ఆమె చెప్పింది.ప్రతీ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరింది. . ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. రవణికి క్రికెట్లో సహకారం అందించే విధంగా నోడల్ కలెక్టర్కు లేఖ రాస్తామన్నారు. వెంటనే కడప క్రికెట్ అసోసియేషన్ చైర్మన్కు ఫోన్ చేసి రవణి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, రవణి తలిదండ్రులు గోపాల క్రిష్ణ, చిట్టెమ్మ, గిరిజన సంఘం నాయకులు క్రిష్ణారావు పాల్గొన్నారు.










