ప్రజాశక్తి- తగరపువలస : భీమిలి మండలం పెద నాగమయ్యపాలెంలో జరిగిన మండల స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. క్రికెట్ క్రీడాకారుడు సింహాద్రి స్మారక మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో ఎర్రయ్యపాలెం జట్టుపై పెదనాగమయ్యపాలెం జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎపి మత్స్యకార సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ టోర్నమెంట్లో పెదనాగమయ్యపాలెం జట్టు సభ్యులకు షీల్డ్ అందజేసి అభినందించారు. విన్నర్లకు రూ.20 వేలు, రన్నర్లకు రూ.10 వేలు, మూడో స్థానంలో నిలిచిన చిన నాగమయ్యపాలెం జట్టుకు రూ.5 వేలు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మాజీ సభ్యులు ఎస్ అప్పారావు, టిడిపి మండల అధ్యక్షులు డిఎఎన్.రాజు, మాజీ సర్పంచ్ గరికిన పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.










