ప్రజాశక్తి-వన్టౌన్: వెలంపల్లి సాయి అవనిష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నాకౌట్ టీ-10 క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ సహకారంతో పోలవరపు సత్తి ఆర్గనైజింగ్ చేసి, గత పది రోజులుగా జరుగుతున్న వెలంపల్లి సాయి అవనిష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నాకౌట్ టీ10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ టోర్నమెంట్లో విజేతగా ట్రైకో-సిసి ఫైనల్లో గెలిచి కప్పు సొంతం చేసుకుంది. ఫైనల్ విజేతకు రూ. 25 వేలు మరియు మెమొంటోను, అలాగే రన్నరప్గా సత్తి-సిసికి రూ.15 వేలు మెమొంటోను, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బక్షి -సిసికి చెందిన మనీకి రూ.5 వేలు మెమొంటోను మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలంపల్లి మాట్లాడుతూ చదువుతో పాటు ఆట పాటల్లో కూడా యువత పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ నేతృత్వంలో ఈ పోటీలు జరగటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, పడిగపాటి చైతన్య రెడ్డి, ఇర్ఫాన్, మైలవరపు దుర్గారావు మరియు ఆర్గనైజర్లు దుర్గారావు, రామకష్ణ, రాము, సభ్యులు పాల్గొన్నారు.










