Nov 19,2023 21:01

క్రికెట్‌ చూసేందుకు భారీగా తరలివచ్చిన యువత

కడప : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కడప ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కడప నగర జిల్లా క్రికెట్‌ అభిమానులు, ప్రేక్షకులు వీక్షించే విధంగా అతిపెద్ద స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. మ్యాచ్‌ను తిలకించేందుకు క్రికెట్‌ అభిమానులు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. కడప ఆర్ట్స్‌ కాలేజ్‌ మైదానం జనంతో పోటెక్కిపోయింది. అంతకుముందు భారత జట్టు ప్రపంచ కప్‌ గెలవాలని కోరుకుంటూ కడప జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌, ఏసీఏ సౌత్‌ జోన్‌ అకాడమీ ఆధ్వర్యంలో కడప నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు, అకాడమీ సభ్యులు క్రికెట్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.