
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు శనివారం క్రీడా సామగ్రిని అందజేశారు. నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ చేతుల మీదుగా క్రీడాకారులకు వీటిని అందజేశారు. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆర్చరీ, బాక్సింగ్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ తదితర ఆరు క్రీడలలో వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడా అధికారి నగిరెడ్డి సూర్యారావు వీటిని సమకూర్చారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ఈ నెలలో తిరుపతిలో జరిగిన సీఎం కప్ సీనియర్ బాక్సింగ్ పోటీలలో బంగారు పతకాలు గెలుచుకున్న మహిళా బాక్సర్లు బొంతు మౌనిక, కొలుకుల కృష్ణవేణి లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ, నింజాస్ అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు, డైరెక్టర్లు లగుడు శ్రీనివాస్, వెలగ జగన్నాథం, వూషఉ కోచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.