Oct 18,2023 00:37

క్రీడాకారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

క్రీడాకారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

నగరిలో తొలిసారిగా రాష్ట్రస్థాయి జూనియర్‌ బాల్‌బాడ్మింటన్‌ పోటీల నిర్వహణకు శ్రీకారం..
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి రోజా

ప్రజాశక్తి- నగరి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కె.రోజా అన్నారు. నగరిలోని మంత్రి కార్యాలయంలో రాష్ట్రస్థాయిలో తొలిసారిగా నిర్వహించనున్న 8వ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల ఆహ్వాన పత్రిలను మంగళవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతోపాటు వారిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా నాలుగేళ్లుగా ఏపీసీఎం కప్‌, జగనన్న క్రీడాసంబరాలు, సాప్‌ క్రీడాపోటీలు, రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ క్రీడాపోటీలు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడాపోటీలు అంటూ ఎన్నో పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. నగరిలోని కేవీకే మైదానంలో రాష్ట్రస్థాయి బాల్‌ బాడ్మింటన్‌ పోటీలను తొలిసారిగా ఈనెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ వారు ఇక్కడ నిర్వహించే పోటీల్లో ఎంపికయ్యే క్రీడాకారులను జాతీయస్థోయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.బాలాజీ, ఉపాధ్యక్షులు డి.గోపి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి.సురేష్‌ బాబు, నగరి బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోహన్‌, పీడీలు ఎన్‌ఆర్‌ మణి, చంద్ర, శ్రీనివాసతేజ తదితరులు పాల్గొన్నారు.