ప్రజాశక్తి-అనకాపల్లి
క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేటప్పుడు క్రీడా స్ఫూర్తితో మెలిగి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని టెన్నికాయిట్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ కాశి విశ్వేశ్వరరావు అన్నారు. ఏపీ టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ నిర్వహించిన 35వ అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల టెన్నికాయిట్ పోటీల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో కాశీ విశ్వేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై మక్కువ పెంచుకొని శారీరక మానసిక దారుడ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న 13 జిల్లాల క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఈ నెల 22 నుంచి రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదిన సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే అంతర్ రాష్ట్ర టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ జట్టును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి తవిటయ్య, ప్రకాశం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, రంగస్వామి, వై గోవింద, పి రమణ రావు, ఆర్ నారాయణ రావు, కే యం నాయుడు, నారాయణమ్మ, లక్ష్మణరావు, కెఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










