
ప్రజాశక్తి - ఆరిలోవ : నేపాల్ దేశంలోని కరాటే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను 11వ వార్డు క్యాంప్ కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ, విదేశాలలో విశాఖ కీర్తిని పెంపొందిస్తున్న కరాటే క్రీడాకారులను నగర ప్రజలు గుర్తించుకుంటారన్నారు. మన క్రీడాకారులు నేపాల్లోని లుంబినిలో జరిగిన గౌతమ బుద్ధ అంతర్జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ - 2023 పోటీలకు భారతదేశం నుంచి 14 టీములు పాల్గొన్నాయని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ వోడో - ర్యూకింగ్ ఆఫ్ కరాటే ఛాంపియన్ డోజో నుంచి 15 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారని, వారిలో ఎనిమిది బంగారు, ఆరు వెండి, ఐదు కాంస్య పతకాలు సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. కరాటే పోటీలలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన అసోసియేషన్ చీఫ్ కోచ్ శ్రీనివాసరావును, క్రీడాకారులను ఇతర కోచ్లను మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాసరావు, బి.వెంకటరావు, కన్నారావు, కరాటే మాస్టర్ చిన్నారావు, రమణమూర్తి, నూకరాజు, గోపాలరావు, అప్పలరాజు, హరినాధరావు తదితరులు పాల్గొన్నారు.