
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : విశాఖపట్నం-కొరాపుట్ సెక్షన్ను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ సత్పతి శనివారం తనిఖీ చేశారు. వివిధ స్టేషన్లలో ఏర్పాటుచేసిన సౌకర్యాలు, ఆ విభాగంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. కేటరింగ్ యూనిట్లు, వెయిటింగ్ హాళ్లు, ఇతర సౌకర్యాలను కూడా పరిశీలించారు. శివలింగపురం, అరకు, సుక్కు, కోరాపుట్ స్టేషన్లలోని రైల్వే కార్యాలయాలు, ముఖ్యమైన స్టేషన్లలో భద్రతా అంశాలనూ పరిశీలించారు. ఈ మార్గంలో తరుచు రైళ్లు పట్టాలు తప్పడానికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు అధికారులతో కలిసి సుక్కు-కోరాపుట్ మధ్య పట్టాలు తప్పిన సిట్ను కూడా పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్లాట్ఫారమ్, స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించి ప్రయాణికులతో సంభాషించారు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట ఎడిఆర్ఎం (ఇన్ఫ్రా) సుధీర్కుమార్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కో-ఆర్డినేషన్) పికె మహారాణా, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ జి.సునీల్ కుమార్, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ప్రవీణ్ భాటి, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్కె పాత్ర అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.