ప్రజాశక్తి - మాచర్ల : మండలంలోని కొప్పునూరు పొలిమేర గుండాలలో శిలాయుగపు చిత్రకళ వెలుగు చూసిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఇఒ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆదివారం తెలిపారు. పురాతన అవశేషాలు, వారసత్వ కట్టడాలను గుర్తించి, స్థానికులకు అవగాహన కల్పించే 'ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ 'కార్యక్రమంలో భాగంగా కొప్పునూరు శివారులోని గుండాల వద్ద గల వీరుల వాగు వద్ద కాకతీయుల కాలపు శిధిల వెంకటేశ్వర ఆలయాన్ని పరిశీలిస్తుండగా వాగులో కొత్త రాతియుగపు దుప్పి బొమ్మను కనుగొన్నట్లు చెప్పారు. మాచర్ల చరిత్రకారుడు పావులూరి సతీష్, రమేష్, కొప్పునూరుకు చెందిన స్థానిక యువకుడు, దుర్గంపూడి యుగనాథ్రెడ్డి, బుద్ధవనం ప్రాజెక్టు అధికారి, డి.ఆర్. శ్యాంసుందరరావు బృందంతో కలిసి వాగులో తిరిగి వస్తుండగా శిలాయుగపు రాతి ఆవాసపు గోడపై 20×15 సెంటీమీటర్ల పొడవు, ఎత్తులతో ఉన్న దుప్పి చిత్రం కనిపించిందన్నారు. కొత్త రాతియుగపు ప్రజలు వారు నిత్యం వాడే రాతి పనిముట్లతో రాతిచరియ కప్పుపై వరసగా కొట్టి, చక్కటి కొమ్ములున్న దుప్పి బొమ్మను తీర్చిదిద్దారని, కొంచెం దూరంలో కొత్త రాతియుగపు రాతి పనిముట్లు తయారు చేసుకొన్న ఫ్యాక్టరీ స్థలం ఉందని చెప్పారు. అదే వీరుల వాగులో ఉన్న మరో రాతి ఆవాసంపై తెల్ల జిగురు రంగుతో ముద్రించిన రెండు చేతి ముద్రలు ఉన్నాయని, సమీప పొలాల్లో ఉన్న ఇనుప యుగపు సమాధుల వల్ల ఈ చేతి ముద్రలు క్రీస్తూ పూర్వం వెయ్యేళ్ల నాటివని శివనాగిరెడ్డి వివరించారు. వాగు బయట గల పొలాల్లో శాతవాహన కాలపు ఇటుకలు, మట్టి పాత్రల అవశేషాలను కూడా గుర్తించామని తద్వారా, కొప్పునూరుకు శిలాయుగం నుండి శాతవాహన కాలం వరకు చరిత్ర ఉందని తెలిపారు. ఈ పురావస్తు ఆధారాలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలని, కొప్పునూరు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.










