Aug 07,2021 08:56

న్యూఢిల్లీ : భారత్‌లో తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న కోవోవాక్స్‌ టీకాను త్వరలో అందుబాటులోకి తెస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిఇఒ అదర్‌ పూనావాలా తెలిపారు. వయోజనుల కోసం అక్టోబర్‌లో, చిన్నారులకు 2022 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయని ఆశాభావ వ్యక్తం చేశారు. అదేవిధంగా అన్ని విధాలుగా సీరమ్‌ సహకరిస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... డిమాండ్‌ నేపథ్యంలో కోవిషీల్డ్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరిచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. శుక్రవారం హోం శాఖ మంత్రి అమిత్‌షాతో అదర్‌ పూణవాలా 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. 'కేంద్రం మాకు సహకారం అందిస్తుండటంతో... ఆర్థిక ఇబ్బందులు లేవు. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు' అని సమావేశం తర్వాత అన్నారు.
పిల్లల కోవిడ్‌ వ్యాక్సిన్ల గురించి అడగ్గా... 'చిన్నారుల కోసం కోవోవాక్స్‌ వ్యాక్సిన్‌ను వచ్చే తొలి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తాం. జనవరి-ఫిబ్రవరిలో రావొచ్చు' అని తెలిపారు. ఇక వయోజనులకు చెందిన కోవోవాక్స్‌ అక్టోబర్‌లో అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయని, డిసిజిఐ ఆమోదంపై ఆధారపడి ఉందని అన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ను ధరను అందుబాటులోకి తెచ్చే సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. కోవిషీల్డ్‌ ఉత్పత్తిపై మాట్లాడుతూ ప్రస్తుతం నెలకు 130 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేస్తున్నామని, ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశాలున్నాయని చెప్పారు. అంతకముందు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయతో భేటీ అయ్యారు.