Mar 08,2023 23:55

ప్రచారం చేపడుతున్న వైవి, లోకనాథం

ప్రజాశక్తి- కె.కోటపాడు:విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యలు, ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్‌ బలపరిచిన డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మండలంలోని కె.సంతపాలెం గ్రామంలో బుధవారం రమాప్రభకు మద్దతుగా ఎమ్మెల్సీ ఓట్లను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నా, ఎల్‌ఐసి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలన్నా, ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించబడాలన్నా 250 ప్రజాసంఘాల బలపరిచిన రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. రమాప్రభను గెలిపిస్తే శాసనమండలిలో ప్రజల సమస్యలపై గళం వినిపిస్తారని తెలిపారు. విద్యావంతులు డాక్టర్‌ రమాప్రభ లాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నుకోబడడం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయినబాబు, ప్రజా సంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు గాడి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : కోరెడ్ల రమాప్రభకు ఓట్లు వేసి గెలిపించాలని బుధవారం మండలంలోని భోగాపురం గ్రామంలో సిఐటియు మండల కార్యదర్శి కె సోమనాయుడు తదితరులు ఇంటింటా ప్రచారం చేశారు. గ్రామంలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో పట్టభద్రులను కలిశారు.
సిపిఐ ప్రచారం
కె.కోటపాడు:ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు పట్టభద్రులను కోరారు. బుధవారం మండలంలోని సూదివలస, మర్రివలస, పాతవలస, శృంగవరం, గొట్లాం తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు రమాప్రభకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గొర్లే దేవుడుబాబు, నాయకులు రెడ్డి అప్పలనాయుడు, ఎల్లాకు రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్‌ :పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ రమాప్రభకు ఓట్లు వేసి గెలిపించాలని దళిత సంఘం నాయకులు కోరారు. నర్సీపట్నంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి, నర్సీపట్నం డివిజన్‌ అధ్యక్షులు ఎడారి మల్లేష్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు శ్రీనివాస్‌, దళిత సంఘం నాయకులు రాజ్‌, కెవిపిఎస్‌ నాయకులు నాయుడు పాల్గొన్నారు.
రోలుగుంట:ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి కోదండ్ల రమాప్రభను గెలిపించాలని దళిత సంఘాల నాయకులు మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడేందుకు పేద ప్రజల వాణి శాసన మండలిలో వినిపించేందుకు రమాప్రభకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, నర్సీపట్నం డివిజన్‌ అధ్యక్షులు మల్లేష్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు శ్రీనివాస్‌, దళిత సంఘం నాయకులు లావరాజు, కెవిపిఎస్‌ నాయకులు నాయుడు పాల్గొన్నారు.
గొలుగొండ:ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభను గెలిపించాలని బిఎస్పీ జిల్లా ఇన్‌చార్జ్‌ బి.నాగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి.సత్తిబాబు ఆధ్వర్యంలో గొలుగొండ స్టేట్‌ బ్యాంకు, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను, ఉద్యోగుల సమస్యలు శాసనమండలి వినిపించాలంటే ప్రశ్నించే గొంతుకను మాత్రమే ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు సంజీవ్‌, వాడపల్లి, నెల్లూరి చిరంజీవి పాల్గొన్నారు.
ములగాడ : హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ సంస్థలోని ఉద్యోగ, కార్మికుల హక్కులు సాధనకు నిబద్దతతో కృషి చేస్తానని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ హామీఇచ్చారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా షిప్‌యార్డు గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులను కలిసి మాట్లాడారు. విశాఖ అభివృద్ధిలో హిందుస్థాన్‌ షిఫ్‌యార్డుకు విశేష ప్రాధాన్యత ఉందని, సంస్థ అభివృద్ధికి పాటుపడతానన్నారు. రాజకీయాలకు అతీతంగా 250 ప్రజాసంఘాలు తనకు మద్దతునిస్తున్నాయని, వారి ఆశలు, ఆకాంక్షలు వమ్ముకాకుండా, అందరి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో షిప్‌యార్డు గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణమూర్తి, షిఫ్‌ యార్డు సిఐటియు అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రాంజీ, అంబేద్కర్‌, ఎస్‌.ప్రసాద్‌, ఎఐటియుసి నేతలు మళ్ల చిన్నా, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జోన్‌ నాయకులు పి.పైడిరాజు, యూనియన్‌ నేతలు బిఎస్‌ఎన్‌ రాజు, జి.సత్యనారాయణ, ప్రసాద్‌, కె.రామచంద్రరావు, గోవింద్‌ పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ప్రచారం
భీమునిపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు బుధవారం కొత్తపేట, విల్సన్‌పేట ప్రాంతాల్లో కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రమాప్రభను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్‌ అప్పలనాయుడు, ఐద్వా, కెవిపిఎస్‌, డివైఎఫ్‌ఐ నేతలు కె.నాగరాణి, భాగం లక్ష్మి, ఎస్‌ శ్రీనివాసవర్మ పాల్గొన్నారు
గాజువాక : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ గెలుపు కోరుతూ సాయిరాంనగర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి, రమాప్రభను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు పాలూరు లక్ష్మణస్వామి, నాయకులు కె.సంతోషం, సిఐటియు నేత రాంబాబు పాల్గొన్నారు..
ఎన్నికల కరపత్రాల ఆవిష్కరణ
గాజువాక : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని ఐద్వా నేతలు కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీలానగర్‌లో సమావేశమైన ఐద్వా సభ్యులు ఎన్నికల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా నేత మాధురి మాట్లాడుతూ, రమాప్రభ విజయం సాధిస్తే మహిళా సమస్యలపై పోరాడతారన్నారు. కార్యక్రమంలో ఐద్వా విశాఖ కార్యదర్శి సత్యవతి, మణి, రమణి, మాధవి, కరుణ, రాధ, మణి, పద్మ, శ్రీదేవి పాల్గొన్నారు.