Feb 23,2023 00:17

నామినేషన్‌ వేస్తున్న వైసిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి బుధవారం నామినేషన్లు ప్రక్రియ కోలాహలంగా సాగింది. ఒకే రోజు 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసిపి, టిడిపి, బిజెపి సహ స్వతంత్రులు 9 మంది నామినేషన్లను విశాఖపట్నం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జునకు సమర్పించారు.
అధికార వైసిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి.సుబ్బారెడ్డి ఆధ్వర్యాన సంపత్‌ వినాయక టెంపుల్‌ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి నామినేషన్లు సమర్పించారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడికి రాజన్నదొర, ఐటి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ సత్యవతి, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, వరుదు కల్యాణి, కోలా గురువులు, డిప్యూటీ మేయర్లు సతీష్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
టిడిపి అభ్యర్థి వి.చిరంజీవిరావు నగరంలోని టిడిపి ప్రధాన కార్యాలయం నుంచి కలెక్టరేట్‌గా ర్యాలీగా వచ్చి నామినేషన్‌ సమర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాజు అచ్చన్నాయుడు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆరోపించారు. మూడు జిల్లాల్లో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు చేయించారని, వాలంటీర్లను, వెలుగు ఉద్యోగులను ఉపయోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కోండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి పివిఎన్‌.మాధవ్‌ బిజెపి నగర కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ సమర్పించారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఉత్తరాంధ్రలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థులుగా పురిపండ శ్రీనివాసరావు, గుండుపల్లి.సతీష్‌, దండేల ఆనందరావు, కల్లా లోకనాథం, ఈర్లె శ్రీరామమూర్తి, ఆడారి శరత్‌చంద్ర, బలివాడ రామసంతోష్‌, రాజాన మోహనరావు, గ్రిద్దలూరు విజరుకుమార్‌ తమ నామినేషన్లు దాఖలు చేశారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి బుధవారం వరకు మొత్తం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.