Jun 21,2023 00:44

అధికారికి వినతిపత్రం ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలోని, బిఆర్‌ స్టేడియం ఎదురుగా ఉన్న కోడిగుడ్డు సత్రం హాస్టలను ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ ఎఎస్‌డబ్ల్యూఒ చెంచులక్ష్మికి వినతిపత్రం అందచేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బాలాజీ, ఎం.కిరణ్‌ మాట్లాడుతూ నగరంలో కొన్నేళ్లుగా ప్రారంభానికి నోచని కోడిగుడ్డు సత్రం హాస్టళ్లను తక్షణమే ప్రారంభించి, విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుతున్న హాస్టళ్లు సొంత భవనాల్లేని కారణంగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన కోడిగుడ్డు సత్రం హాస్టల్‌ను ప్రారంభించడానికి స్థానిక అధికారులు వాయిదాలు వేస్తూ, నిరుపయోగంగా ఉంచటం సరికాదన్నారు. కోడిగుడ్డు సత్రం హాస్టల్‌ని వెంటనే ప్రారంభించి విద్యార్థులకు అందుబా టులోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రూపస్‌, నగర కార్యదర్శి సమీర్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.