ప్రజాశక్తి -సీలేరు : కోడిపందేలు, పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవని జీకే వీధి సీఐ జి.అశోక్ కుమార్, ఎస్ఐ కె.అప్పలసూరి హెచ్చరించారు. శుక్రవారం జీకే వీధి పోలీస్ స్టేషన్లో వారు విలేకర్లతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాట ఆడ వద్దని, మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించే వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడలను ఆడాలని యువతకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. పేకాట కోడిపందేలు వంటి వ్యసనాలకు అలవాటు పడితే ఆస్తులు, కోళ్లు, మేకలు అమ్ముకుంటున్నారని తెలిపారు. పేకాట, కోడిపందేలు శిబిరాలపై నిఘా ఉంచి దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పండగ పూట సరదాలు, సంతోషాలతో నిండాలే తప్ప విషాదలాతో ఉండకూడదని ప్రతి ఒక్కరు తాము ఉదహరించిన విషయాలను గ్రహించి జాగ్రత్తలు పాటించాలని కోరారు.










