Sep 10,2023 21:44

పలుచోట్ల నిరసనలు, అరెస్టులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో రెండోరోజు ఆదివారం కూడా జిల్లాలో టిడిపి నాయకుల అరెస్టులు, గృహనిర్బంధాలు కొనసాగాయి. జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అరెస్టయ్యారు. ఇదిలా ఉండగా చంద్రబాబును రిమాండ్‌కు తరలించడంతో ముందస్తుగా ఎక్కడికక్కడ భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో టిడిపి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : 
చంద్రబాబునాయుడు అరెస్టు సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌, నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్రను వారి వారి ఇళ్లల్లోనే నిర్బంధించారు. రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమవుతున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పార్వతీపురం వైకెఎం కాలనీలో ఉన్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనేల్‌ విజయచంద్ర ఇంటి ప్రాంగణంలో మండల, పట్టణ ప్రాంతాలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించి శాంతియుతంగా కొనసాగించారు.
కురుపాం : చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టులను నిరసిస్తూ స్థానిక టిడిపి కార్యాలయం వద్ద ఆదివారం తెలుగు తమ్ముళ్లు నిరసన చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటే అనుమతి లేకుండా పోలీసులు తమను ఇంటి నుండి బయటకు రాకుండా చేయడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కిమిడి రామరాజు, నందివాడ కృష్ణబాబు, అంబటి రాంబాబు, శేఖర్‌ పాత్రుడు, విశ్వనాథం, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు ను రిమాండ్‌ కు తరలిస్తున్న నేపథ్యంలో కురుపాం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు..
భూదేవి దీక్ష భగం
సీతంపేట : చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా టిడిపి నాయకులు పడాల భూదేవి నిరసన చేపట్టారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్‌ నోటికి కట్టి మౌన దీక్ష చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దీక్షను భగం చేసి అదుపులోకి తీసుకున్నారు. భూదేవికి మద్దతుగా వచ్చిన టిడిపి నాయకులు బిడ్డిక జయలక్ష్మి, కుండంగి తేజోవతి, సవర మంగయ్య, సవర శిమ్మయ్యను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇంటి వద్ద జగదీశ్వరి నిరసన దీక్ష
గుమ్మలక్ష్మీపురం : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కురుపాం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి తోయక జగదీశ్వరిని ఎల్విన్‌ పేట పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో ఆమె ఆ పార్టీ నాయకులతో కలిసి ఇంటి వద్ద నిరసన దీక్ష చేపట్టారు. జనసేన మండల అధ్యక్షులు కడ్రక మల్లేశ్వరరావు సంఘీభావం తెలిపారు. మరోవైపు గృహనిర్బంధంలో ఉన్న రెండో వర్గానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు బిడ్డిక పద్మావతికి జన సైనికులు సంఘీభావం తెలిపారు.
వీరఘట్టం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ స్వగ్రామైన ఎం.రాజపురంలో ఆదివారం సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, నియోజకవర్గ యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, తెలుగు యువత అధ్యక్షులు మాచర్ల అనిల్‌, బి.హరిబాబు, యామక అప్పలనాయుడు, ఎన్‌.శశికుమార్‌, సిహెచ్‌.ఉమామహేశ్వరరావు, జగదీష్‌, కె.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ముందస్తుగా ఆదివారం ఎస్‌ఐ ఎం.వెంకటరమణ, సిబ్బంది ఎం.రాజపురం గ్రామానికి చేరుకొని జయకృష్ణను గృహ నిర్బంధం చేశారు. ఆయనతో పాటు టిడిపి మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, మండల యువత అధ్యక్షులు మాచర్ల అనిల్‌, బల్ల హరిబాబు, ఎన్‌ శశి కుమార్‌, సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, యామక అప్పలనాయుడు , కె.ధర్మారావు తదితరలను హౌస్‌ అరెస్టు చేశారు.
సాలూరు: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా స్థానిక టిడిపి నాయకుల నివాసాల్లో వేర్వేరుగా దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌ నివాసంలో ఆయన అనుచరులు దీక్ష చేపట్టారు. ఈ దీక్ష లో సాలూరు మండల పార్టీ అధ్యక్షులు ఎ.పరమేష్‌, మాజీ అధ్యక్షులు చోడవరపు గోవింద రావు, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పప్పల మోహన్‌ రావు, మండల సీనియర్‌ నాయకులు మత్స శ్యాం సుందర్‌ పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణి తన నివాసంలో అనుచరులతో దీక్ష నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహారదీక్షలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆమె నివాసంలో దీక్ష చేపట్టారు.

అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఒంటికాళ్లతో జనసేన నిరసన
గుమ్మలక్ష్మీపురం : శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని జనసేన మండల అధ్యక్షులు కడ్రకమల్లేశ్వరరావు అన్నారు. ఎల్విన్‌పేటలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద జనసేన కార్యకర్తలు కళ్లకు నల్లబ్యాడ్జీలతో ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని వైసిపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, ప్రజల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి పాస్‌పోర్టు అవసరమా అని ప్రశ్నించారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం సమర్ధనీయం కాదని దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అధికారి అనిల్‌, యువరాజ్‌, భవానీ శివ తదితరులు పాల్గొన్నారు.