
ప్రజాశక్తి-పెందుర్తి : శారదాపీఠం వార్షిక మహోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. మూడో రోజున ఆదివారం లోక కల్యాణార్ధం రుద్ర హోమం, వనదుర్గా హోమం నిర్వహించారు. లక్ష మూల మంత్రాలతో చేపట్టిన రాజశ్యామల యాగం కోసం విశేష ద్రవ్యాలను వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ దంపతులు రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతా మూర్తుల ఆలయాలను సందర్శించి యాగంలో పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఉత్సవాల్లో పాల్గొని పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. స్వరూపానందేంద్ర సూచనల మేరకు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో దధి (పెరుగు) నివేదన ఆరంభించామని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. దీనిపై మంత్రి చొరవను స్వామీ అభినందించారు. కుండలో ఉంచిన పాలకు తోడు పెట్టి నివేదన సమర్పిస్తే విగ్రహాలు పాడవకుండా ఉంటాయని సంతోషం వ్యక్తం చేశారు. మరోపక్క టీటీడీ చేపట్టిన చతుర్వేద హవనం వేదోక్తంగా సాగుతోంది. మూడు రోజులపాటు నిర్వహించిన చాత్తాడ శ్రీ వైష్ణవ ఆగమ సదస్సులు ముగిశాయి. అర్చక అకాడమీ డైరెక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యాన ఈ సదస్సులను నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న విద్యార్ధులకు పీఠం తరపున ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రోత్సాహక సర్టిఫికెట్లను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఇఒ సాగర్బాబుతో పాటు ఆలయ పండితులు పీఠానికి వచ్చి శివరాత్రి వేడుకలకు హాజరు కావాల్సిందిగా స్వాములను కోరారు.
ఆకట్టుకున్న యోగీత బిందు నృత్య ప్రదర్శన
శ్రీ సాయి కళానికేతన్ రాగిణి కూచిపూడి నాట్య మండలి ఆధ్వర్యాన నిర్వహించిన కూచిపూడి నాట్య మయూరి యోగీత బిందు ప్రదర్శించిన నాట్యం భక్తులతో పాటు ప్రముఖులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తించింది. భక్తులు కరతాళ ధ్వనులతో యోగీత బిందును ఆశీర్వదించారు. యోగీత బిందుకు పీఠాధిపతులు స్వరూప నందేంద్ర స్వామి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ నాట్యంలో నాట్యమండలి చిన్నారులు పాల్గొన్నారు.