ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం: . కేంద్ర ప్రభుత్వం ''స్పూర్తి పథకం, ఎంపి లాడ్స్'' సంయుక్తంగా 2కోట్ల 29 లక్షల 50 వేల నిధులతో నిర్మించిన కొండపల్లి బొమ్మల తయారీ, విక్రయ భవనసముదాన్ని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కలిసి సంయుక్తంగా గురువారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బొమ్మల తయారు చేసే వారికి టూల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని, కలెక్టర్ డిల్లీరావు మాట్లాడారు. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ (ఎన్ఐ - ఎమ్మెస్ ఎమ్ఇ) ఆధ్వర్యంలోని నిపుణులు కొండపల్లి కళాకారుల నైపుణ్యాన్ని నిపుణుల ఆధ్వర్యంలో ఆధునిక పద్ధతులను నేర్పించడంతో పాటు కొత్తదనాన్ని జోడించి నైపుణ్యాభివద్ధి చేయనున్నట్లు తెలిపారు. మార్కెటింగ్ సదుపాయాల పట్ల కూడా ఈ సంస్థ ఎన్ఐ - ఎమ్మెస్ఎమ్ఇ కళాకారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.172.50 లక్షలు కేటాయించిందని, ఈ పథకం నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 90 శాతం, బొమ్మల కళాకారులు 10 శాతం ఆర్థికంగా భాగస్వామ్యం కావాల్సివుందని అన్నారు. అయితే బొమ్మల కళాకారుల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఎంపి నిధుల నుండి రూ.29.50 లక్షలు విడుదల చేసినట్లు చెప్పారు. బిల్డింగ్ నిర్మాణానికి అదనంగా నిధులు అవసరమై ఉన్న సమయంలో కళాకారులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాగా ఈ మేరకు స్పందించి రూ.25.50 లక్షలు ఎంపి నిధుల నుండి మంజూరు చేసినట్లు తెలిపారు.










