
ప్రజాశక్తి-కోటవురట్ల:ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు పందూరు గ్రామంలో లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. పందూరు గ్రామానికి సమీపంలో కొండ పోరంబోకు భూమి సుమారు రెండు ఎకరాల కాలనీలకు కేటాయించారు. దీనికోసం రూ.15 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం, రూ.5 లక్షలతో బోరు, కరెంటు వంటి సౌకర్యాలు కల్పించారు. సుమారు ఇక్కడ 61 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇల్లు మంజూరు చేశారు. అయితే ఎవరూ ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో నేటికీ ఒక్క ఇల్లు కూడా మొదలు పెట్టలేదు. కొండకు దగ్గరగా ఉండటం కారణంగా నిర్మాణాలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రస్తుతం కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. మందుబాబులు మద్యం సేవించేందుకు నిలయంగా మారింది.