May 13,2023 18:41

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పు బిజెపికి చెంపపెట్టు లాంటిదని జైభీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ విమర్శించారు. శనివారం జిల్లా కన్వీనర్‌ గందాలం మణికుమార్‌ మాదిగ ఆధ్వర్యంలో స్థానిక ప్రయివేట్‌ లాడ్జిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 136 సీట్లు సాధించి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మతతత్వ పార్టీగా గుర్తింపు పొందిన బిజెపికి 64 సీట్లు, జెడిఎస్‌ పార్టీ 20 సీట్లు, ఇతరులకు 4 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ బిజెపి తరఫున ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని, ఎస్సీ వర్గీకరణను వంద రోజుల్లో చేస్తానని మోసం చేసిన పార్టీ అని తెలిపారు. అలాంటి పార్టీకి మందకృష్ణ మాదిగ మద్దతునిచ్చి మళ్లీ మాదిగలను మోసం చేశారని దుయ్యబట్టారు. అంబేద్కర్‌ రచించిన అతి పెద్ద గ్రంథం భారత రాజ్యాంగమని, ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా నడిచే ప్రజాస్వామ్యాన్ని కూల్చాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. బిజెపికి కర్ణాటక ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం హర్షనీయమన్నారు. జాతిని బిజెపి మతతత్వ పార్టీకి తాకట్టు పెట్టిన మందకృష్ణ మాదిగ ఆటలు ఆంధ్రప్రదేశ్‌లో సాగనివ్వబోమని తెలిపారు. రాష్ట్రంలో మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే కర్ణాటక ఓటర్లలాగే రాష్ట్ర ఓటర్లు కూడా వైసిపికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జై భీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ రంగస్వామి, మంత్రాలయం మండల అధ్యక్షులు నరసింహులు, ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు పెద్ద ముష్టి అబ్రహాం పాల్గొన్నారు.