ప్రజాశక్తి -తగరపువలస : కనీస పింఛను రూ.9వేలుకు పెంచాలని, 3 డిఎలు వర్తింపచేయాలని, పింఛనుదారులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, రైల్వే ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిట్టివలస పోస్టాఫీసు ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. చిట్టివలస ప్రాంతీయ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పింఛను దారుల సంఘం ఆధ్వర్యాన ప్లకార్డులు చేత బూని పింఛను దారులు ధర్నాలో పాల్గొన్నారు. ప్రధానమంత్రికి పోస్టుకార్డుల ద్వారా తమ సమస్యలను తెలియజేసినట్లు సంఘం గౌరవాధ్యక్షులు మావూరి వీర్రాజు, అధ్యక్షులు అల్లు బాబూరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రసాద్, సహాయ కార్యదర్శి దామోదర బాబాజీ, కానూరి రాంబాబు, ఆర్.ఈశ్వరరావు, నూలు ఆదినారాయణ, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్.అప్పల నాయుడు పింఛనుదారులకు సంఘీభావం తెలిపారు. ముందుగా చిట్టివలస ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి జంక్షన్ మీదుగా పోస్టాఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. పోస్టు మాస్టార్కు వినతిపత్రం అందించారు.










