Apr 23,2023 21:41

స్వాధీనం చేసుకున్న వాహనాన్ని మీడియాకు చూపుతున్న ఎస్పీ

కంటైనర్‌ దొంగల అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు అరెస్ట్‌
రూ.5 లక్షల 92 వేల విలువ గల సొత్తు, రూ.8 లక్షల కారు స్వాదీనం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      హైవేలలో వెళ్తున్న కంటైనర్‌లలో దొంగతనం చేసే అంతర్రాష్ట్ర కంజర్బట్‌ ముఠా సభ్యుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. రూ,. 3 లక్షల 92 వేల విలువైన సొత్తు, రూ. 8 లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌పి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.... మధ్యప్రదేశ్‌ రాష్ట్రం షాజాపూర్‌ జిల్లా గులానా తాలూకా మక్వడా గ్రామానికి చెందిన సంజరు పడిహర్‌ ఈ ఉఏడాది ఫిబ్రవరి 21న హైదరాబాద్‌ నుండి బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్‌లో వెనుక భాగంలో సీల్‌ కట్‌ చేసి అందులో 17 మల్బారో సిగరెట్‌ బాక్స్‌లను, మార్చి 16న హైదరాబాద్‌ నుండి బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్‌లో 65 సిల్వర్‌ మాక్స్‌ కంపెనీ షేవింగ్‌ బ్లేడ్‌ బాక్స్‌లను దొంగతనం చేశాడు. ప్యాపిలి పోలీస్‌ స్టేషన్‌కు సంబందించిన రెండు హైవే దొంగతనం కేసులలో డోన్‌ ఎస్‌డిపిఒ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల సిసిఎస్‌ సిఐ పి.రామకృష్ణ, ప్యాపిలి సిఐ పి.శ్రీరాములు, నంద్యాల సిసిసి శ్రీనివాసులు, ప్యాపిలి ఎస్‌ఐ సిఎం రాకేష్‌, సిబ్బందికి అందిన కచ్చితమైన సమాచారం మేరకు సిబ్బంది షాజాపూర్‌ జిల్లాకు చేరుకొని సంజరు పడిహర్‌ని మక్వడా ఊరి బయట ఉన్న రాయల్స్‌ డాబా వద్ద ఈ నెల 22న శనివారం పట్టుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించాడు. దొంగతనం చేసిన సుమారు 2 లక్షల 96 వేల రూపాయల విలువ గల 20 బ్లేడ్‌ బాక్స్‌లను, నేరానికి ఉపయోగించిన సుమారు 8 లక్షల విలువ చేసే క్రెటా కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అలాగే అంతకు ముందు ఈ కేసులలో అతని సహచరులైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 20 బ్లేడ్‌ బాక్స్‌లను స్వాధీన పరచుకొని రిమాండ్‌కు పంపామన్నారు. ఈ సంచలనమైన కేసును డిటెక్ట్‌ చేయడానికి ప్రత్యేక బృందం సిసిఎస్‌ సిఐ పి.రామకృష్ణ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వివిధ ప్రాంతంలో తిరిగి సమాచారం సేకరించి ప్యాపిలి పోలీస్‌ స్టేషన్‌లోని 2 కేసులను డిటెక్ట్‌ చేసి చేసిన ప్యాపిలి సిఐ పి.శ్రీరాములు, సిసిఎస్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు, ప్యాపిలి ఎస్‌ఐ సిఎం రాకేష్‌, సిబ్బంది హెచ్‌సి ఇబ్రహీం అలియాస్‌ మున్నా, పిసిఎస్‌ హుస్సేన్‌ బాషా, శివ ప్రసాద్‌, వెంకటేష్‌, టెక్నికల్‌ సిబ్బంది మధు, శేఖర్‌ రెడ్డిలకు ఎస్‌పి నగదు బహుమతి అందజేసి అబినందించారు.