
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న క్రైమ్ స్పాట్ క్లూస్ టీం ఏర్పాటుచేసిన వాహనాలను, క్రైమ్ జరిగిన సంఘటనలలో గుర్తించే పరికరాలను ఎస్పీ మాధవ్ రెడ్డి గురువారం పరిశీలించారు. జిల్లాలోని ధర్మవరం, కదిరి, పుట్టపర్తి , సబ్ డివిజన్లలో మూడు క్రైమ్ స్పాట్ క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ సంబంధించి టీములను ఏర్పాటు చేశారు. వీటి పనితీరు తెలుసుకునేందుకు ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన వీటిని పరిశీలించారు. హత్యలు అనుమానాస్పద మృతి, దొంగతనాలు, బాంబ్ బ్లాస్టింగ్ తదితర నేరాలు జరిగినప్పుడు క్లూస్ టీం ఘటన స్థలంలో ఎవిడెన్స్ సేకరించే విధానాలు, ఫింగర్ ప్రింట్స్ పౌడర్, నేర పరిశోధనలు సాక్షాధారాలను, పరికరాలను వాటి పనితీరు గురించి క్లూస్ టీం సిబ్బంది ఎస్పీకి వివరించారు. ఇప్పటివరకు జరిగిన క్రైమ్ స్పాట్ లలోక్లూస్ టీమ్ వర్క్ చేసి చేధించిన కేసుల వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం అప్రమత్తంగా ఉంటూ ప్రధాన సంఘటనలు తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించి కేసుకు బలమైన ఎవిడెన్స్ నిలిపే విధంగా పని చేయాలన్నారు. ప్రతి ఎవిడెన్స్ రికార్డులలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఇప్పటివరకు క్రైమ్ స్పాట్స్ క్లూస్ టీం పనితీరును ఎస్పీ అభినందించారు. జిల్లాలోని ఎస్ఐలు సిఐ, డీఎస్పీలు నేరాలు జరిగిన వెంటనే ఆధారాలు తొలగిపోకుండా క్లూస్ టీం ద్వారా వెంటనే కేసు చేధించే దిశగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి సిఐ సుబ్బారావు, ఫింగర్ ప్రింట్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.